ఎవరు ఎవరిని సమర్ధించాలో..ఎవరు ఎవరితో కలసి ఉండాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారా?. అందరూ ఆయన మాట వినాలా?. ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ విమర్శిస్తుంటే పట్టించుకోవటంలేదని..ఏకంగా హైదరాబాద్ వచ్చి విమర్శలు చేసినట్లు ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎలాగైనా కెసీఆర్ ను రెచ్చగొడితే తప్ప ఏపీలో వర్కవుట్ అయ్యేలా లేదని భావిస్తున్నట్లు ఉన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అందుకే గురువారం నాడు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన పవన్ కళ్యాణ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలకు హింసతో కూడిన గిఫ్ట్ ఏంటి?. అసలు పవన్ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి?. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అచ్చం తన పాత భాగస్వామి చంద్రబాబు మాటల తరహాలోనే ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేనల మధ్య పొత్తులేదని చెబుతున్నా..ఇద్దరి లైన్ మాత్రం ఒకేలా ఉంది. అంటే అంతర్గతంగా ఇద్దరి ‘మైండ్ సెట్’లు ఒకేలా ఉన్నాయా?. లేక ఒకరిపై ఒకరు ప్రభావం చూపిస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. గతంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు టీడీపీ టీమ్ అచ్చం ఇలాగే చెప్పింది.
అదేంటో చూడండి. ‘ప్రధాని మోడీ అసలు వాళ్లను ఎందుకు కలిశారు. వాళ్ళకు అసలు అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారు?. దేశానికి ఏమమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు’ ఇవీ ప్రధానితో వైసీపీ నేతలు భేటీ అయిన సమయంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని టీడీపీ నేతలు లేవనెత్తే ప్రశ్నలు. ఎవరు ఎవరిని కలవాలో కలవాలనుకునేవారు..కలిసే వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ చంద్రబాబు ఆదేశాలో..టీడీపీ నేతల భావాలను పరిగణనలోకి తీసుకుని రాజకీయ పార్టీలు వ్యవహరించాలా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో అచ్చం చంద్రబాబు తరహాలోనే కెసీఆర్ ...జగన్ ను సమర్ధించవద్దు. ఏపీలో వేలు పెట్టొద్దు అనే వ్యాఖ్యలు టీఆర్ఎస్ నుంచి రియాక్షన్ కోసం చేసినట్లే కన్పిస్తున్నాయి.