ఇంటర్ బోర్డు వైఫల్యం..సర్కారుదే బాధ్యత

Update: 2019-04-24 10:02 GMT

తెలంగాణ సర్కారు తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆక్షేపణ తెలిపారు. బోర్డు వైఫల్యానికి సర్కారే బాధ్యత వహించాలని అన్నారు. ‘ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్ ను అగమ్యగోచరంగా మార్చడం దారుణం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ప్రతి దశపైనా విద్యార్థుల్లోనూ, వారి తల్లితండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసి, నిజాలు వెల్లడించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, వారి తల్లితండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం.

విద్యార్థులకు ఉచితంగా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయాలి.’ అని ఓ ప్రకటనలో కోరారు. విద్యార్ధులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. జీవితం చాలా విలువైనది. ఈ ఫలితాలతో నిరాశ చెంది ఆత్మహత్యలకు పాల్పడవద్దు. విద్యార్థులకు జనసేన అండగా నిలుస్తుంది. చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేసి తగిన పరిహారం చెల్లించాలి. ఇన్ని తప్పిదాలకు కారణమైన బోర్డు అధికారులు, సాఫ్ట్ వేర్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు న్యాయ విచారణకు ఆదేశించాలి అని డిమాండ్ చేశారు.

 

Similar News