చంద్రబాబులో ఓటమి భయం

Update: 2019-04-13 09:11 GMT

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో ఓటమి స్పష్టంగా కనపడుతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. ఆయనకు కలలో కూడా తెలంగాణ సీఎం కెసీఆరే వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లడగాలని, కానీ చంద్రబాబు మాత్రం నాలుగు ఓట్ల కోసం చిల్లరేషాలు వేసారన్నారు. శనివారం తలసాని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలన్నీ అబద్దాలేనన్నారు.

40 ఏళ్ల సీనియర్‌నని చెప్పుకునే చంద్రబాబువి నీతిమాలిన చర్యలేనన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రజలను కొడుతున్నారని, నాయకుల ఆస్తుల విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని అసత్యప్రచారానికి ఒడిగట్టారని మండిపడ్డారు. చంద్రబాబు నీతిమంతుడైతే.. తన ఆస్థులన్నీ తీసుకొని వెళ్లిపోవాలని సవాల్‌ విసిరారు. ఇక ఈవీఎంల తీరుపై చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎన్నికల ముందు ఒకరోజు టీవీల్లో కనిపించేందుకు ఈసీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డ్రామలాడారన్నారు. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

 

Similar News