దేశంలో బిజెపికి ఓ ఊపు తీసుకొచ్చిన నాయకుల్లో అగ్రగణ్యుడైన ఎల్ కె అద్వానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీకి ఆసక్తి చూపటం లేదు. దీంతో ఆయన ఎన్నికల రాజకీయాలకు దూరం అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అద్వానీని పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు..ఆయనకు పార్టీలో పలుమార్లు అవమానాలు కూడా ఎదురయ్యాయి. కారణాలు ఏమైనా అద్వానీ కూడా చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయం తీసుకున్నారు.
2014 ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్ నుంచి పోటీ చేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్షా గతవారం స్వయంగా అద్వానీని కలిసి గాంధీనగర్ నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. కనీసం ఆద్వాణీ వారసులైన ప్రతిభ, జయంత్లలో ఒకరిని గాంధీనగర్ బరిలో దింపాలని, వారిని గెలిపించుకొనే బాధ్యతను తీసుకుంటామని అమిత్షా కోరారు. దీనికి కూడా అద్వానీ నిరాకరించినట్లు సమాచారం.