టాలీవుడ్ లో ఇది ‘బయోపిక్’ల సీజన్. ఎన్నికల సమయం కావటంతో నేతల బయోపిక్ లు కూడా క్యూకడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పాదయాత్రకు సంబంధించిన అంశంతో తెరకెక్కుతున్న‘యాత్ర’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి రాజశేఖరరెడ్డి పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. వైఎస్ పాత్రకు మమ్ముట్టి సరిగ్గా సెట్ అయ్యారని చెప్పొచ్చు. ఈ సినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ను జారీ చేశారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. సుహాసిని, అనసూయ, రావూ రమేష్, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మించారు.