ప్రధాని నరేంద్రమోడీకి నిరసన సెగ. తమిళనాడు ప్రజలు ‘మోడీ గో బ్యాక్’ అంటూ సోషల్ మీడియా వేదికగా నినదిస్తున్నారు. ఇది ఇప్పుడు ‘ట్రెండింగ్’లో ఉంది. గోబ్యాక్ మోడీ హాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. మోదీ తమిళనాడు పర్యటనను రెండు లక్షలకు పైగా ట్విటర్ ఖాతాదారులు తిరస్కరిస్తుండగా.. ఆయనకు వెల్కం చెబుత్ను వారి సంఖ్య 30 వేల మందే ఉండడం గమనార్హం. ఇంకా కొంతమంది ఏకంగా ద్రవిడ ఉద్యమ నిర్మాత, హేతువాది పెరియార్ రామస్వామి మోదీని బయటకు నెట్టేసే కార్టూన్ను కూడా జతచేస్తున్నారు. తమిళనాడును గజ తుఫాను అతలాకుతలం చేయగా.. కేంద్రం సాయమందించలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకే ప్రధాని పర్యటనపట్ల నిరసన తెలుపుతున్నామని చెప్తున్నారు.
మదురైలో ఏయిమ్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆదివారం తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించారు. గత నవంబర్లో గజ తుపాను ధాటికి తమిళనాడు విలవిల్లాడింది. దాదాపు 59 మంది మృత్యువాత పడగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం సంభవించింది. ఇక మధురైలో ఏయిమ్స్ ఏర్పాటు చేస్తుండడం పట్ల వేలాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధురై థాంక్స్ మోదీ హ్యాష్ ట్యాగ్తో ట్వీట్లు చేస్తున్నారు. టీఎన్ వెల్కం మోదీ మోదీ హ్యాష్ ట్యాగ్తో తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు.