సీఎంపై ఊహించ‌ని దాడి

Update: 2018-11-20 14:17 GMT

అది ఓ ముఖ్య‌మంత్రిపై ఎవ‌రూ ఊహించ‌ని దాడి. ఏకంగా స‌చివాల‌యంలోనే కారం పొడితో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ పై ఈ దాడి జ‌రిగింది. అనిల్ కుమార్ అనే వ్యక్తి సిగరేట్‌ ప్యాకెట్‌లో కారం పొడి నింపుకొని సచివాలయంలోకి వ‌చ్చాడు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారంపొడి చల్లాడు. దీంతో అప్రమత్తమైన సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. కేజ్రీవాల్‌ను చంపేస్తానంటు గట్టిగా అరుస్తూ సీఎం వైపు పరుగెత్తాడు. ఈ ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో కేజ్రీవాల్ కళ్లజోడు కిందపడి పగిలిపోయింది.

అక్కడి భద్రతా సిబ్బంది అతన్ని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఆమ్‌ఆద్మీ తీవ్రంగా మండిపడింది. ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రికే భద్రతలేకుండా పోయింది ట్వీట్‌ చేసింది. ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందా లేదా అన్నది ఇంకా తేలలేదనీ.. పూర్తి వివరాలు తెలియకుండా తాము ఎవరిపైనా ఆరోపణలు చేయబోమని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. గ‌తంలోనూ కేజ్రీవాల్ పై ప‌లుమార్లు ఇలాంటి త‌ర‌హా దాడులు జ‌రిగాయి.

Similar News