మోడీ సర్కారుకు షాక్. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో డాలర్ తో రూపాయి మారకం విలువ భారీగా పతనం అవటం మోడీ సర్కారుకు చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో మోడీ ఇదే అంశాన్ని టార్గెట్ చేశారు. ఆర్థిక శాస్త్ర వేత్త ప్రధానిగా ఉన్నా..రూపాయి రోజురోజుకూ ఎందుకు క్షీణిస్తోందని..రూపాయి ఐసీయూలో ఎందుకు ఉందని ప్రశ్నలు గుప్పించారు. ఇప్పుడు మోడీ జమానాలోనూ అదే జరుగుతోంది. అంతే కాదు. రూపాయి పతనం లో రికార్డులు నమోదు చేస్తోంది. దేశీయ కరెన్సీ రూపాయిమొట్టమొదటిసారి డాలర్కు మారకంలో 69 మార్కుకు ఆల్-టైమ్ కనిష్ట స్థాయిలకు పడిపోయింది.
బుధవారం ట్రేడింగ్ ముగింపులోనే భారీగా పతనమైన రూపాయి, గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనూ మరింత క్షీణించింది. ప్రస్తుతం 79 పైసల మేర క్షీణించి 69.04గా ట్రేడవుతోంది. బుధవారం కూడా 37 పైసల మేర పడిపోయి 19 నెలల కనిష్టంలో 68.61 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయని సంకేతాలు, ఈ రేట్ల పెరుగుదలతో కరెంటు ఖాతా లోటు మరింత పెరుగుతుందని, ద్రవ్యోల్బణమూ ఎగుస్తుందని ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొనడం రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 70 నుంచి 70.50 స్థాయిలకు పడిపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.