చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Update: 2018-04-30 03:44 GMT

తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన అవినీతికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి అన్ని ఆధారాలు సమర్పిస్తానని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ లు అవినీతి చేయబట్టే కేంద్రానికి భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో హవాలా వ్యాపారులతో పాటు విదేశాల్లోని ఆయుధ డీలర్లతోనూ చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖపట్నం వేదికగా చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ సభాప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని అన్నారు.

2014 ఏప్రిల్‌ 30న తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభకు, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న చేపట్టిన సభ లక్ష్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయని అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అదొక అధర్మ సభ అని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు ఈ సభను చిత్తశుద్ధితోనే నిర్వహిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొండపైన బీజేపీతో టీడీపీ జట్టు కడుతూ.. కొండ కింద కుస్తీ పడుతోందన్నారు. చంద్రబాబుపై ఢిల్లీలో చేసిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉన్నానని విజయసాయి చెప్పారు. ప్రతి ఆరోపణకు తన వద్ద రుజువులు ఉన్నాయని తెలిపారు.

 

Similar News