తెలంగాణలో మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలకు రెక్కలు

Update: 2021-01-21 17:07 GMT

మరోసారి తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగబోతున్నాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ దగ్గర జరిగిన సమీక్షలో అధికారులు ఇదే సంకేతాలు ఇచ్చారు. ప్రభుత్వం సాయం అందించటంతోపాటు ఛార్జీలు పెంచితేనే ఆర్టీసీ మనుగడ సాధ్యం అవుతుందని తెలిపారు. భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా లాక్ డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదించారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. '' గతంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్ కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక భారం మోపింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలను చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉంది.

ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు'' అని అధికారులు సిఎంకు వివరించారు.''వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బస్సులు తిప్పడం వల్ల మంచి ఫలితం వచ్చింది.

ఆక్యుపెన్సీ శాతం 58 శాతానికి చేరుకుంది. క్రమంగా ఇది పెరుగుతున్నది. దీనివల్ల రోజుకు 9 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. అయితే డీజిల్ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతున్నది. లాక్ డౌన్ మిగిల్చిన నష్టాలు, పాత అప్పులు ఇంకా గుదిబండగానే ఉన్నాయి'' అని వారు వివరించారు. ఆర్టీసీలో కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్శిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసికి 22.61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని సిఎం చెప్పారు.

Tags:    

Similar News