Full Viewస్క్రిప్ట్ రాసేవాళ్లు లేరా?. కొత్తగా ఏమి రాయించుకుందాం..పాత డైలాగులు వాడితే సరిపోతాయి అనుకుంటున్నారా?. కేంద్రంలో అప్రతిహత అధికారం. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు బిజెపి చేతిలోనే. ఆర్ధిక వనరులకు కొదవేలేదు. కేంద్ర ఏజెన్సీలు అలా ఈల వేస్తే ఇలా వచ్చిపడతాయి. కానీ ఎంత సేపూ ప్రధాని మోడీ దగ్గర నుంచి హోం మంత్రి అమిత్ షా..బిజెపి జాతీయ ప్రెసిడెంట్ నడ్డా..ఇప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్. సేమ్ డైలాగ్ . 2019 ఎన్నికల సమయంలో ఇదే తరహాలో బిజెపి అగ్రనేతలు అందరూ అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలవరం ఏటీఎంగా మారింది..ఏటీఎంగా మారింది అంటూ ఊదరగొట్టారు. కానీ అసలు ఆ పోలవరం ఏటీఎంలో కేంద్రం, బిజెపి నేతలు ఎంత మొత్తం పెట్టారు...చంద్రబాబు ఎంత మొత్తం డ్రా చేసుకున్నారో ఇప్పటివరకూ తేలింది ఏమీలేదు. తేలుతుందనే నమ్మకం కూడా లేదు. ఓ వైపు దేశంలోని పార్టీలు..పెద్ద పెద్ద నాయకులను వణికిస్తున్న బిజెపి ఎందుకు ఆ ఏటీఎంలో ఇరుక్కుని బయటకు రాలేకపోతుంది.
ఆ స్టాక్ డైలాగ్ నే పదే పదే వాడటం వల్ల అసలు బిజెపి నేతలు చెప్పే మాటలతో ప్రజలు ఎక్కడైనా కనెక్ట్ అవుతారా?. ఇలా పాచిపోయిన డైలాగ్ వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది. గత ఎన్నికల్లో పోలవరం ప్రాజెక్టులో అవినీతి గురించి చెప్పటానికి వాడిన ఏటీఎం డైలాగ్ లు ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి గురించి ప్రస్తావించటానికి వాడుతున్నారు. హోం మంత్రి అమిత్ షా దగ్గర నుంచి జె పి నడ్డా. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి, ఇప్పుడు షెకావత్. అంతా ఏటీఎంలో స్ట్రక్ అయినవారే. ఈ డిజిటల్ యుగంలో ఎన్నో కొత్త చెల్లింపు పద్దతులు వచ్చాయి. అయినా బిజెపి నేతలు మాత్రం ఇంకా ఏటీఎంలోనే స్ట్రక్ అయిపోయారు. వీరు ఇందులో నుంచి ఎప్పుడు బయటకు వస్తారు..ఆరోపణలు నిరూపించి ఎప్పుడు సత్తా చాటుతారు అన్నది వేచిచూడాల్సిందే.