Full View'వరుడు కావలెను' సినిమాతో నాగశౌర్య తాజాగా హిట్ కొట్టాడు. కలెక్షన్లపరంగా ఈ సినిమా ఎంత వసూలు చేసింది అనే విషయంలో రకరకాల వార్తలు వచ్చినా సినిమా మాత్రం మంచి హిట్ టాక్ దక్కించుకుంది. ఇప్పుడు నాగశౌర్య 'లక్ష్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. బుధవారం సాయంత్రం 'లక్ష్య' ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ లు నిర్మాతలుగా ఉన్నారు.
విలువిద్య నేపథ్యంలో.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్తో ఈ సినిమా తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. సృజనమణి రాసిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆడే ముందు కొంత మందికి దేవుడు బొమ్మ చూస్తే ధైర్యం..వీడికి నేను కన్పిస్తే ధైర్యం. 'వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నాడు .. నువ్వు తప్పుడు దారిలో గెలవాలనుకున్నావు.. ఇద్దరూ ఒకటేగా' అంటూ సాగే డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, సచిన్ కేడ్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచిందనే చెప్పొచ్చు.