బంగారం, వెండి ధరలకు సంబంధించిన ర్యాలీకి బ్రేక్ పడింది. అయితే కరోనా సమయంలో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. తాజాగా పసిడి, వెండి ధరలు మళ్లీ వెనకడుగు వేస్తున్నాయి. అటు న్యూయార్క్ కామెక్స్ లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్ లోనూ నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తొలి డిబేట్ ప్రారంభమైన నేపథ్యంలో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్లో లాభాల స్వీకరణకు రెడీ అయినట్లు బులియన్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆర్థిక మంత్రి స్టీవ్ ముచిన్తో చర్చల తదుపరి ఈ వారంలో సహాయక ప్యాకేజీ డీల్ కుదిరే వీలున్నట్లు యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ మంగళవారం పేర్కొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు జంప్చేసిన సంగతి తెలిసిందే. ఎంసీఎక్స్ లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 171 తగ్గి రూ. 50,510 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ. 1,167 పతనమై రూ. 61,299 వద్ద కదులుతోంది.