దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖల మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్ర విధానాలు మరింత సరళతరం కావాల్సిన అవసరముందని కెటీఆర్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పాలసీలో దేశానికే ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటీఆర్ మాట్లాడుతూ.. ఇండియన్‌ ఎకనమిక్‌ సమ్మిట్‌లో భాగంగా జరిగిన యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌ సెషన్లో ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ అద్భతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారానే పారిశ్రామిక ప్రగతి సాధ్యమయిందని తెలిపారు. విజనరీ లీడర్‌ షిప్‌ ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనేందుకు తెలంగాణానే నిదర్శమని అన్నారు.