ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడుంటే వివాదాలు అక్కడే ఉంటాయి. ఆయనపై తాజాగా మరో కేసు నమోదు అయింది. ఈ కేసు నమోదు చేసింది కూడా ఢిల్లీ పోలీసులే కావటం విశేషం. హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా కేజ్రీవాల్ కామెంట్ చేశారని.. బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. యాపిల్ సంస్థ మేనేజర్ వివేక్ తివారిని శుక్రవారం ఉత్తర ప్రదేశ్ పోలీసులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. యూపీలో జరుతున్నవి బూటకపు ఎన్కౌంటర్లని, బీజేపీ హిందూవులకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలమైందని కేజ్రీవాల్ విమర్శించారు.
అంతటితో ఆగకుండా బీజేపీ నేతలు హిందూ యువతులను లైంగికంగా వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. హిందూవుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని మండిపడింది. బీజేపీ నేతలు ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 153ఎ, 295ఎ సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేక్ తివారిని ఎలాంటి కారణం చూపకుండా యూపీ పోలీసులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.