సుప్రీంకోర్టు గురువారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కం ఏ మాత్రం నేరం కాదని పేర్కొంది. సుదీర్ఘ కాలం వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఇది వ్యక్తిగత హక్కుల కిందకే వస్తుందని తేల్చింది. పరస్పర అంగీకారంతో జరిగే లెస్బియన్-గే బై సెక్సువల్ ట్రాన్స్ జెండర్ హక్కులకు హరించటం సరికాదని పేర్కొంది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. హోమో సెక్సువాలిటి నేరంగా పేర్కొంటున్న భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 377పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సెక్షన్ను రద్దు చేయడం ద్వారా ఎల్జీబీటీ (లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్జెండర్) హక్కులను కాపాడాలని పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది.
వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. తద్వారా సెక్షన్ 377పై సుదీర్ఘం కాలంగా సాగుతున్న వివాదానికి స్వస్తి పలికింది. అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ ఏకగ్రీవంగా ఈ తీర్పును వెలువరించడం విశేషం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ ఖాన్విలకర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. స్వజాతి లైంగిక చర్య నేరం కాదని తాజా తీర్పు తేల్చి వేయడంతో ఎల్జీబీటీ హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఒక కొత్త శకానికి ఇది నాంది అని వ్యాఖ్యానించారు.