అవినీతి ఆరోపణలు ఆయన రాజకీయ జీవితానికి ముగింపు పలికాయి. పాక్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయన ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేదు. కొత్తగా ఎలాంటి పదవులు చేపట్టే అవకాశం లేదు. ఈ మేరకు ఐదుగురు జడ్జీలతో కూడిన పాక్ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనర్హత వేటు వంటి చర్యలు అవసరమని కోర్టు పేర్కొంది. నవాజ్‌ షరీఫ్‌తో పాటు పాకిస్తాని తెహ్రీక్ ఇన్సాఫ్‌ (పీటీఐ) సెక్రటరీ జనరల్‌ జహంగీర్‌ తరీన్‌పైనా జీవిత కాలంలో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జిస్టస్‌ సాఖిబ్‌ నిసార్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్‌ ఈ తీర్పును వెలువరించింది.

పనామా పేపర్ల కేసుకు సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆదాయ వివరాలను వెల్లడించకపోవడంతో జస్టిస్‌ అసిఫ్‌ సయీద్‌ ఖోసా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన పాక్‌ సుప్రీం బెంచ్‌ గత ఏడాది జులై 28న నవాజ్‌ను అనర్హుడిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. తాజా ఉత్తర్వుల ప్రకారం పాక్‌ మాజీ ప్రధాని జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని, ప్రభుత్వ పదవులు చేపట్టరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.