ఆమె వెయ్యి కోట్ల ఎంపీ!

Update: 2018-03-13 06:26 GMT

అవును. ఆమె ఆస్తులు వెయ్యి కోట్ల రూపాయలు. ఇవి ఎవరో చెప్పిన మాటలు కాదు.స్వయంగా ఆమె తన రాజ్యసభ అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలే. అంతే కాదు..ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీగా ఆమె నిలిచారు. ఆమె ఎవరో కాదు..జయాబచ్చన్. ప్రస్తుతం కొత్తగా 58 రాజ్యసభ స్థానాల భర్తీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ తప్పనసరి అయిన చోట ఈ నెల 23న ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నో విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ అత్యంత సంపన్నుడైన ఎంపీగా ఉన్న రవీంద్రకిషోర్ సిన్హా తన హోదాను కోల్పోతున్నారు. ఆయన స్థానంలో జయాబచ్చన్ వచ్చారు. ఇంతకాలం బీహార్ కు చెందిన రవీంద్ర కిశోర్‌ సిన్హాకు అత్యంత సంపన్న ఎంపీగా రికార్డుల్లో ఉన్నారు.

తాజాగా జయాబచ్చన్ తన ఎన్నికల అఫిడవిట్‌లో రూ.1000కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. జయా బచ్చన్‌ సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. తనతోపాటు భర్త అమితాబ్‌వి కలిపి రూ.1000 కోట్ల ఆస్తులున్నట్లు తెలిపారు. అదే 2012లో ఆమె తన ఆస్తిని రూ.460 కోట్లుగా ప్రకటించారు. బీహార్‌కు చెందిన రవీంద్ర కిశోర్‌ సిన్హా.. 2014 రాజ్యసభ ఎన్నికలో రూ.800 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ ఆయనే ‘రిచెస్ట్‌ ఎంపీ’గా కొనసాగారు. ఇప్పుడు జయ రూ.1000కోట్ల ప్రకటనతో కిశోర్‌ రెండో స్థానానికి పడిపోయారు.

 

Similar News