Telugu Gateway
Telangana

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
X

తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రం సహాయనిరాకరణ చేస్తోందని ఐటి మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. 'బులెట్ ట్రైన్ గుజరాత్‌కి మాత్రమేనా?.. హైదరాబాద్‌కి అర్హత లేదా?. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అడిగాం. కేంద్రం పట్టించుకోవడం లేదు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం ల్యాండ్ ఇస్తామన్నా అస్సలు పట్టించుకోవడం లేదు'' అని అన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయట్లేదని దక్షణాది రాష్ట్రాలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని విమర్శించారు. ఆత్మనిర్భర్‌ భారత్ కేవలం నినాదంగానే మిగిలిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో కేటీఆర్‌ మాట్లాడారు. 'వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరి అన్నారు.. 60 ఎకరాల ల్యాండ్ అడిగితే 150 ఎకరాలు ఇచ్చాము. అయినా ఫ్యాక్టరీ లేదు.

ఐటీఐఆర్ కారిడార్ రద్దు చేశారు. తెలంగాణకి అన్యాయం చేశారు. మేకిన్ ఇండియా అన్నారు. ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇక ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఊసులేదు. కేంద్రం హామీలిచ్చి మారిస్తే ఎవర్ని అడగాలి. ఎలక్షన్స్ కోసం కాదు.. ప్రజలకోసం.. ఇండియా కోసం పనిచేయండి. దిగుమతి సుంకాలు పెంచి మేక్ ఇన్ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా?. తెలంగాణ నుంచి ఎక్కువ రెవెన్యూ తీసుకుంటూ.. తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గత కొంత కాలంగా కేంద్రంపై కెటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇది మరింత పెరిగింది.

Next Story
Share it