Telugu Gateway
Andhra Pradesh

రైతులనూ నమ్మించి మోసం చేస్తున్న వైసీపీ సర్కారు

రైతులనూ నమ్మించి మోసం చేస్తున్న వైసీపీ సర్కారు
X

ఏపీ ప్ర‌భుత్వ తీరుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులకు ధాన్యం సొమ్ములు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంద‌ని, ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వరా? అని ప్ర‌శ్నించారు. నెలాఖరులోగా ప్రతి గింజకు డబ్బులు ఇవ్వాల‌ని, లేని పక్షంలో రైతుల కోసం పోరాడతామ‌ని తెలిపారు. ఈ మేర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ద‌ళారుల‌ను త‌ల‌ద‌న్నేలా ప్ర‌భుత్వ‌మే రైతులను రోడ్డు మీదకు తెచ్చిన ప్రభుత్వం ఇదే అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. 'రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకుండా ఆ కష్ట జీవులతో కనీళ్లు పెట్టిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రూ.3 వేల కోట్లకుపైగా వరి పండించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడింది. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి నిరుద్యోగులను ఎలా మోసపుచ్చారు. రైతన్నలను కూడా నమ్మించి మోసం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు డబ్బు జమ చేస్తామని చెప్పారు. పాలనలోకి వచ్చిన తొలినాటి నుంచి నేటి వరకూ వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వడంలో విఫలమవుతూనే ఉంది. రోజులు కాదు వారాలు, నెలలు గడుస్తున్నా రైతుకు మాత్రం డబ్బు అందటం లేదు. రబీ సీజన్లో కొన్న ధాన్యానికి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల్లోనే రూ.1800 కోట్లు వరకూ రైతులకు బకాయిలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను, లెక్కలను ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారో రైతులకు సమాధానం చెప్పాలి. కొనుగోలు, బకాయిల విషయంలో ప్రభుత్వం గోప్యత ఎందుకు పాటిస్తోంది? తమ కష్టార్జితం కోసం అడిగిన రైతులను అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు దూషించి, బెదిరించడం దుర్మార్గం. నెలాఖరులోగా రైతుల బకాయిలు చెల్లించని పక్షంలో రైతులకు జనసేన పార్టీ అండగా నిలిచి పోరాడుతుంది. ఇంతకు ముందూ రైతుల కోసం కాకినాడలో 'రైతు సౌభాగ్య దీక్ష' చేపడితేనే ప్రభుత్వం దిగి వచ్చి రైతులకు సొమ్ములు జమ చేసింది. రబీ డబ్బులు వస్తేనే ఈ సీజన్లో పంటకు పెట్టుబడి ఉంటుంది.

రబీ డబ్బులు రాక, రుణాలు అందకపోతే వ్యవసాయ పనులు ఎలా మొదలుపెడతారు. పంట నష్ట పరిహారం కూడా సక్రమంగా చెల్లించరు. ఇలాంటి పరిస్థితులోనే కోనసీమలోని గ్రామాల్లో రైతులు ఇక పంట వేయబోమని క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వ వైఖరే కారణం. జొన్న, మొక్క జొన్న కొనుగోలు విషయంలోనూ రైతులను పార్టీలవారీ విడదీయడం దురదృష్టకరం. అధికార పార్టీకి మద్దతుగా ఉన్నవారి నుంచే పంటను కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను అందించడంలోనూ పార్టీ లెక్కలే చూస్తున్నారు. పండించే పంటకీ, తినే తిండికీ పార్టీ రంగులు పులమడం దిగజారుడుతనమే. మిర్చి రైతులకు అవసరమైన విత్తనాలు అందకపోవడంతో మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నకిలీ విత్తనాలు, పురుగుల మందుల వ్యాపారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోంది? విత్తనాల సరఫరా నుంచి పంట కొనుగోలు వరకూ, పంట నష్టపరిహారం, బీమా చెల్లింపుల్లో ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోంది. జనసేన పార్టీ ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటుంది. వారి కోసం పోరాడుతుంది' అని ప్ర‌క‌టించారు.

Next Story
Share it