ఏపీ సర్కారు..41 వేల కోట్లకు సరైన లెక్కల్లేవ్
తెలుగుదేశం నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ఏపీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతున్నారని..ప్రైవేట్ లిమిటెడ్ లో అయినా లెక్కలు ఉంటాయి కానీ..ఈ సర్కారులో అవి కూడా లేవన్నారు. ఇదే అంశంపై పయ్యావుల కేశవ్ గురువారం నాడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలసి ఫిర్యాదు చేశారు. 41 వేల కోట్ల రూపాయల బిల్లులకు సంబంధించిన సరైన లెక్కలు లేవన్నారు. ఇదేదో ఆరోపణ కాదని..ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఈ విషయాన్ని వెల్లడించారన్నారు.
అన్నింటికి ప్రత్యేక బిల్లులు చెల్లించినట్లు..ప్రత్యేక బిల్లులు సర్దుబాటు చేసినట్లు రాశారు తప్ప... అందులో వివరాలు ఏమీ లేవని తెలిపారు. రెండేళ్లలో ఆర్థిక శాఖలో జమా ఖర్చుల లెక్కలు అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నర్ హరిచందన్కు పయ్యావుల ఫిర్యాదు చేశారు. రెండేళ్లకు సంబంధించిన ఆర్థికశాఖ రికార్డులను.. స్పెషల్ ఆడిటింగ్ చేయించాలని గవర్నర్ను కోరారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శికి రాసిన లేఖను గవర్నర్కు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా.. ఆర్థిక, జమ ఖర్చుల నిర్వహణపై దృష్టి పెట్టాలని పయ్యావుల కేశవ్ కోరారు.