Telugu Gateway
Andhra Pradesh

జగన్ కంటిపైన గాయం

జగన్ కంటిపైన గాయం
X

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఎండలతో పాటు రాజకీయం వేడెక్కింది. ఒక వైపు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మరో వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోరుగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో శనివారం రాత్రి విజయవాడలో చోటు చేసుకున్న పరిణామం ఒక్కసారిగా కలకలం రేపింది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉండగా శనివారం రాత్రి ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసరడంతో సీఎం జగన్ఎ డమ కంటి పైభాగంలో గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీనిపై వెంటనే రాజకీయ రగడ మొదలైంది. విజయవాడలో సీఎం వై ఎస్ జగన్‌పై గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియా ల వేదికగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్య. రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించండి. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారు’’ అని వ్యాఖ్యానించింది. మరో వైపు తెలుగు దేశం పార్టీ కూడా కోడి కత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అంటూ తన అధికారిక పేజీ లో ఒక పోస్ట్ పెట్టింది.

Next Story
Share it