Telugu Gateway
Andhra Pradesh

అసెంబ్లీ సమావేశాలకు సర్వసన్నద్ధం కండి

అసెంబ్లీ సమావేశాలకు సర్వసన్నద్ధం కండి
X

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సారి మరింత హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులకు అసెంబ్లీ సమావేశాలపై పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు సాగేది కొద్ది రోజులే అయినా పలు కీలక అంశాలు లేవనెత్తేందుకు ప్రతిపక్షం రెడీ అవుతోంది. దీంతో అందరిలో ఈ సమావేశాలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే శుక్రవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ నివర్‌ తుపానుపై కేబినెట్‌లో చర్చించామని తెలిపారు. ఇప్పటి వరకూ అందిన నివేదిక ప్రకారం ''30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి'' డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారు.

సుమారు 10వేల మందికిపైగా సహాయక శిబిరాలకు తరలించాం. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారని'' మంత్రి కన్నబాబు వెల్లడించారు. అదే సమయంలో డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీల నిర్మాణం, డిసెంబర్ 8న 2.49లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూ సేకరణ, 2019 ఖరీఫ్‌ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

వైఎస్‌ఆర్‌ శాశ్వత భూహక్కు, యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదించింది. రూ.9,027 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పింఛన్‌దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించామని, 3.144 శాతం డీఏ పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయించిందన్నారు.కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్‌, జనవరి నెలలో చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 25న 30లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, మూడేళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

Next Story
Share it