ఓ వైపు కాంగ్రెస్ తోపాటు దేశంలో పార్టీలు అన్నీ ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఇది కాంగ్రెస్ తోపాటు..ఎన్నికల కమిషన్ పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు వంటి వారికి షాక్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల కమిషన్ పై వస్తున్న విమర్శల గురించి ప్రస్తావిస్తూ చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడని, మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగించుకుంటాడని వ్యాఖ్యానించారు. తాజాగా ప్రణబ్ కేంద్ర ఎన్నికల సంఘంపై ప్రశంసల జల్లు కురిపంచారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీని కొనియాడారు. విపక్షాలు ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని ప్రణబ్ హితవుపలికారు.
భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, అవన్నీబాగా పనిచేస్తున్నాయని ప్రశంశించారు. సుదీర్ఘ కాలంలో రాజ్యాంగ సంస్థలు నిర్మించబడ్డాయి. తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎన్నికల సంఘం అద్భుతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో 2/3 ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల కమిషనర్లు అందరిని ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయి.’’అని ప్రణబ్ వ్యాఖ్యానించారు.