లక్ష కోట్లకు చేరువలో జొమాటో మార్కెట్ క్యాపిటలైజేషన్
జొమాటో లిస్టింగ్ అయిన తొలి రోజే స్టాక్ మార్కెట్లో ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. ఐపీవోతోపాటు సెకండరీ మార్కెట్లోనూ ఈ కంపెనీ షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆన్ లైన్ ఫుడ్ డెలివరి సేవలు అందించే ఈ సంస్థ షేర్లు శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. లిస్ట్ అయిన దగ్గర నుంచే మదుపర్లు ఈ షేర్లను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తిచూపించారు. తొలి రోజు 4.51 కోట్ల షేర్లు చేతుల మారగా..ఒక్క బీఎస్ ఈలోనే 575.60 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు అయింది.
తొలి రోజే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు చేరువ కావటం సంచలనంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నికరంగా కంపెనీ మార్కట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం 98,731.59 కోట్ల రూపాయలుగా ఉంది. ఆఫర్ ధర షేరుకు 76 రూపాయలుగా నిర్ణయించగా..ఓ దశలో 20 శాతం గరిష్ట ధర 138 రూపాయలకు చేరింది. కానీ చివరకు లిస్టింగ్ ధర కంటే 50 రూపాయల లాభంతో 125.85 రూపాయల వద్ద ముగిసింది. జొమాటో లిస్టింగ్..ఈ ఐపీవోకు లభించిన స్పందన చూసిన తర్వాత మరిన్ని కంపెనీలు ఐపీవోలకు వచ్చేందుకు క్యూకడుతున్నాయి.