Telugu Gateway
Top Stories

పెరుగుతున్న యూపీఐ మోసాలు

పెరుగుతున్న యూపీఐ మోసాలు
X

చిలక జోస్యం దగ్గర కూడా ఇప్పుడు పేటీఎమ్ చెల్లింపులు ఆమోదిస్తాం అనే బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. చాయ్ తాగినా ..సిగరెట్ కొన్నా కూడా ఇప్పుడు అంతా ఆన్ లైన్ చెల్లింపులే . ఫోన్ తీయటం..క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేసి వెళ్ళిపోవటం. దీంతో జేబులో డబ్బులు పెట్టుకోవాల్సిన పని తప్పుతుంది. మరో వైపు చిల్లర సమస్యలు కూడా లేకుండా పోయాయి. ఇప్పుడు ఎక్కువ చెల్లింపులు ముఖ్యంగా నగరాల్లో అయితే అంతా యూనిఫైడ్ ప్రెమెంట్స్ ఇంటర్ పేస్ (యూపీఐ) ద్వారానే జరుగుతున్న విషయం తెలిసిందే. 2026 -2027 ఆర్థిక సంవత్సరం నాటికి యూపీఐ చెల్లింపులు రోజుకు వంద కోట్లకు చేరతాయని అంచనా. యూపీఐ విధానంతో చెల్లింపుల వ్యవస్థ ఎంతో సులభతరం అయినా కూడా అదే సమయంలో సమస్యలు కూడా అలాగే పెరుగుతూ పోతున్నాయి. ప్రతి ఏటా యూపీఐ మోసాలు పెరుగుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెపుతున్నాయి. 2022 -2023 ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 95 వేలకు పైగా యూపీఐ కేసు లు నమోదు అయ్యాయి.

పెరుగుతున్న ఆన్ లైన్ చెల్లింపులను వాడుకుని కొంత మంది సైబర్ నేర గాళ్ళు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. దొంగ లింక్ లు ఫోన్ కు పంపించించి వాటిని క్లిక్ చేసిన తర్వాత వారి ఖాతాల్లోని నగదు కొట్టేస్తున్నారు. అందుకే ఏ లింక్ లు పడితే ఆ లింక్ లను క్లిక్ చేయవద్దని ఆన్ లైన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికంగా చూస్తే యూపీఐ లావాదేవీలు చాలా సురక్షితమైనవి అని...ఓటీపీ..యూపీఐ పిన్ వివరాలు షేర్ చేయకుండా ఉన్నంత కాలం ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెపుతున్నారు. ముఖ్యంగా ఈ చెల్లింపుల విషయంలో ఎవరో ఒత్తిడి చేస్తున్నారు అని చెల్లింపులు చేయకుండా ఆచితూచి అడుగులు వేయాలని చెపుతున్నారు. యూపీఐ పిన్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటే అసలు ఏ మాత్రం సమస్యలు ఉండే అవకాశం ఉండదు అన్నది నిపుణుల మాట.

Next Story
Share it