భవిష్యత్ భారతం ఎవరిదో తేల్చే ఎన్నికలివి
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
యూపీలో ఏడు విడతల్లో...మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు
ఫిబ్రవరి 10న తొలి విడత ప్రారంభం
పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి
ఫలితాలు మార్చి 10న
మరో పంచతంత్రం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోరు కు రంగం సిద్ధం అయింది. ఎత్తులు...పైఎత్తులు. ఎవరి గెలుపు వ్యూహాలు వారివే. రైతుల విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తరుణంలో జరుగుతున్న ఎన్నికలు కావటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్ భారతం ఎవరిదో చెప్పే ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. 2024లో జరగనున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న అత్యంత కీలకమైన ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికల్లో అందరి ఫోకస్ మాత్రం ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవాలపైనే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లో ఎ
వరు అధికారం సాధిస్తే వారే కేంద్రంలో అధికారం సాధిస్తారనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అతి పెద్ద రాష్ట్రం కావటం..అక్కడ సీట్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు వీరవిహారం చేస్తున్నా..కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి పార్టీలకు పలు సూచనలు చేసింది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు మే 14తో ముగుస్తుండగా, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీల కాలపరిమితి మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్ను ప్రకటించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతాయి.
ఐదు రాష్ట్రాల్లో 18.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ మహిళా ఓటర్లు పెరిగారు. ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కల్పించనున్నారు ఈ ఎన్నికల్లో మాస్క్, థర్మల్ స్కానర్లు, శానిటేషన్ తదితర లాజిస్టిక్స్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచుతామని షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈసీ అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో 2,15, 368 పోలింగ్ కేంద్రాలు పెంచారు. యూపీలో ప్రతి పోలింగ్ స్టేషన్లో సగటున 862 మంది ఓటర్లు ఓటు వేస్తారు. దీనివల్ల పోలింగ్ కేంద్రాలలో రద్దీ తగ్గుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు వేసే అవకాశం కల్పించాం. అభ్యర్థులు నేర చరిత్రను పార్టీలన్నీ తమ వెబ్ సైట్లలో హోం పేజిలో ఉంచాలి.
అభ్యర్థిని ఎంపిక చేసిన 24 గంటల్లో నేరచరిత్ర వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించటంతో వెంటనే అమల్లోకి ఎన్నికల కోడ్ వచ్చేసింది. ఐదు రాష్ట్రాలకుగానూ 900 మంది ఎన్నికల పరిశీలకులను నియమించారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్లో అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్లో ఈ వ్యయం రూ..28లక్షలుగా ఉంది. డబుల్ వ్యాక్సిన్ తీసుకున్నవారికే ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కోవిడ్ సోకిన వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు.
7 విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు
జనవరి 14న యూపీలో తొలిదశ నోటిఫికేషన్
తొలి దశ పోలింగ్ తేదీ ఫిబ్రవరి - 10
రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి -14
-(పంజాబ్, గోవా,ఉత్తరాఖండ్, యూపీ)
-ఒకే దశలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఎన్నికలు
మూడో విడత పోలింగ్ ఫిబ్రవరి -20
నాలుగో విడత పోలింగ్ ఫిబ్రవరి -23
ఐదో విడత పోలింగ్ ఫిబ్రవరి -27
మార్చి 3న ఆరో విడత ఎన్నికలు
మార్చి 7న ఏడో విడత ఎన్నికలు
మణిపూర్లో రెండు విడతల్లో ఎన్నికలు
ఫిబ్రవరి 27న మణిపూర్ తొలివిడత ఎన్నికలు
మార్చి 3న మణిపూర్ రెండో విడత ఎన్నికలు
మార్చి 10న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
.