ఆప్ ఊడ్చేసిందని..టీవీ9లోకూడా ఊడ్చారు!
జర్నలిజానికే ఇది ఓ కొత్త మలుపు. ఓ మేలుకొలుపు. ఎవరూ కూడా వార్తలు ఇంత అద్భుతంగా చెప్పలేరు. ఎన్నికల వార్తల కవరేజ్ లో అగ్రశ్రేణి ఛానల్ టీవీ9 తనదైన శైలిలో వార్తలు ఇచ్చి తెలుగు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. గురువారం నాడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెల్లడి కావటంతో మీడియా అంతా ఉదయం నుంచే అదే పనిలో ఉంది. అందరిలా ఉంటే తమ స్పెషాలిటీ ఏముంది అనుకున్నారో ఏమో కానీ టీవీ9 ప్రజంటర్ ఓ వెరైటీ పని చేశారు. పంజాబ్ లో ఆమ్ అద్మీ పార్టీ ఘన విజయం సొంతం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అదే విషయాన్ని చెబుతూ ఓ వింత ప్రయోగం చేశారు స్టూడియోలో. ఏకంగా స్టూడియోలోకి ఓ చీపురు పట్టుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ ఇది చీపురుకట్ట.చీపురుకట్టను బేసిక్ గా ఇళ్ళలో ఊడవటానికి మనం వినియోగిస్తూ ఉంటాం.
ఈ విషయాన్ని కూడా సదరు ప్రముఖ ఛానల్ టీవీ9 ప్రజంటరే చెప్పారు ప్రపంచానికి. ఆమ్ అద్మీ పార్టీ ఏమి చేసింది అంటే పంజాబ్ లో మొత్తం ఇట్లా....అంటూ ఏకంగా స్టూడియోలో ఊడ్చి మరీ చూపించారు. పంజాబ్ ను ఈ రకంగా ఊడ్చేసింది అంటూ విత్ యాక్షన్ ప్రేక్షకులకు చూపించారు. దీనిపై అప్పుడే సోషల్ మీడియాలో సైటెర్లు ప్రారంభం అయ్యాయి కూడా. ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ పొరపాటున ఎక్కడైనా కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ గెలిస్తే చెప్పుల జోడు నెత్తిన పెట్టుకోవాల్సి వస్తుంది అంటూ ఎద్దేవా చేశారు. మరో వ్యక్తి బీఎస్పీ గెలిస్తే స్టూడియోలకి ఏనుగు తెచ్చేవారేమో అంటూ కామెంట్ చేశారు.