కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తాం

భారత్ -పాకిస్థాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన వేళ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ‘ది వైర్’ ఇంగ్లీష్ వెబ్ సైట్ ను ఇండియా లో బ్లాక్ చేసినట్లు ది వైర్ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రంలోని ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఐటి చట్టం 2000 ప్రకారం బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇదే విషయం తెలిపినట్లు పేర్కొన్నారు. అత్యంత కీలక సమయంలో ఈ దారుణమైన సెన్సార్ షిప్ ను ఖండిస్తున్నట్లు ది వైర్ వెల్లడించింది.
కేంద్రం తీసుకున్న ఈ ఏకపక్ష, కారణం తెలపకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తామని పేర్కొంది. తమ పాఠకులకు నిజమైన..ఖచ్చితం అయిన సమాచారం ఇవ్వకుండా అడ్డుకోలేరు.. సత్యమేవ జయతే అంటూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు. భారత్-పాకిస్థాన్ ల మధ్య సాగుతున్న యుద్దానికి సంబంధించి ప్రధాన మీడియా తో పాటు సోషల్ మీడియా లో కూడా ఇష్ఠానుసారం వార్తలు ప్రసారం చేస్తున్నారు. పదే పదే భధ్రతా సంస్థలు ఈ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా ఇవి ఆగటం లేదు. కొన్ని జాతీయ ఛానెల్స్ అయితే మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయి అనే విమర్శలు ఉన్నాయి.