Telugu Gateway
Top Stories

ఇన్వెస్టర్లకు లాభాల పంట

ఇన్వెస్టర్లకు లాభాల పంట
X

లిస్టింగ్ రోజే టాటా టెక్నాలజీస్ షేర్లు స్టాక్ మార్కెట్ లో దుమ్ము రేపాయి. ఈ కంపెనీ ఐపీఓ కు కూడా భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. మూడు వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు కంపెనీ షేర్లు జారీ చేయగా..ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలకు విలువకు పైగా బిడ్స్ వచ్చిన విషయం తెలిసిందే. అలాట్ మెంట్ ప్రక్రియ ముగియటంతో గురువారం నాడు ఈ కంపెనీ షేర్లు అటు బిఎస్ఈ, ఎన్ ఎస్ఈ లో లిస్ట్ అయ్యాయి. టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఏకంగా 69 రెట్ల కు పైగా ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. దీనికి తగ్గట్లుగానే ఈ కంపెనీ షేర్లు 140 శాతం ప్రీమియం తో లిస్ట్ అయ్యాయి. ఎన్ ఎస్ఈ లో ఈ షేర్ 1200 రూపాయల వద్ద లిస్ట్ అయితే...బీఎస్ఈ లోనూ పైసల తేడాతో ఇదే ధర వద్ద నమోదు అయింది. ఒక్కో షేర్ ఆఫర్ ధరను కంపెనీ 500 రూపాయలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ లెక్కన లిస్టింగ్ ధర ప్రకారం చూస్తే తొలి రోజే ఒక్కో షేర్ పై ఇన్వెస్టర్లకు 700 రూపాయలు లాభం వచ్చినట్లు. రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఒక కంపెనీ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ పై పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. అందుకు అనుగుణంగానే వాళ్లకు తొలి రోజే లాభాల పంట పండింది అనే చెప్పాలి. లిస్ట్ అయిన తొలి రోజు బీఎస్ఈ లో ఈ షేర్ ధర ఒక దశలో రికార్డు 1400 రూపాయలకు చేరింది. గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బీఎస్ఈ లో ఈ షేర్లు 1343 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఈ కంపెనీ షేర్లు అలాట్ అయిన వారు ఫుల్ ఖుషీగా ఉన్నారనే చెప్పొచ్చు. ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్ కూడా కొత్త కొత్త రికార్డు లు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it