Telugu Gateway
Top Stories

ఇంకా ఆ చ‌ట్టం అవ‌స‌ర‌మా?.

ఇంకా ఆ చ‌ట్టం అవ‌స‌ర‌మా?.
X

రాజ‌ద్రోహం కింద కేసులు న‌మోదు చేసే 124ఏ సెక్షన్ ఇంకా అవ‌స‌రమా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. సెక్షన్ 124ఏను కొట్టేయాలంటూ దాఖ‌లైన పిటీష‌న్ పై విచార‌ణ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్ వి ర‌మ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాల త‌ర్వాత కూడా ఇది ఉండాల్సిన అవ‌స‌రం ఉందా అని ప్ర‌శ్నించారు. ఈ చ‌ట్టాన్ని స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడార‌ని తెలిపారు. పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉంది. వ్యవస్థలకు, వ్యక్తులకు ఈ చట్టం వల్ల తీరని నష్టం జరుగుతోంది. 124ఏ సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు.. అన్నింటినీ కలిపి విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది.

ఈ అంశంలో కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 124 ఏ చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ రిటైర్డ్ మేజర్ జనరల్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్ కేర్ పిటిషన్ దాఖలు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేసే సెక్షన్ 124ఏ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్ వి రమణ అభిప్రాయపడ్డారు. 124 ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనన్నారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడగలుగుతారని పేర్కొన్నారు.రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి.. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఉన్నాయన్నారు.

Next Story
Share it