స్టాక్ మార్కెట్లో కొత్త వైరస్ కల్లోలం
కరోనా టైమ్ లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్ళాయి. గత కొంత కాలంగా నిత్యం కొత్త కొత జీవితకాల గరిష్టాలను తాకాయి. కానీ ఇప్పుడు యూకెలో వచ్చిన కొత్త కరోనా వైరస్ స్టెయిన్ పెరుగుతున్న మార్కెట్ కరెక్షన్ అవకాశ కల్పించినట్లు కన్పిస్తోంది. బ్రిటన్ కు పలు దేశాలు వరస పెట్టి విమానాలను నిలిపివేయటంతో మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడింది. బ్రిటన్లో వెలుగుచూసిన ఈ వైరస్ కారణంగా దేశ, విదేశీ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటే.. దేశీయంగా స్టాక్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సెక్స్ ఏకంగా 1,407 పాయింట్లు పతనం అయి 45,554 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 432 పాయింట్లు పోగొట్టుకుని 13,328 వద్ద స్థిరపడింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 47,056 వద్ద గరిష్టాన్నీ, 44,923 వద్ద కనిష్టాన్ని తాకింది. వెరసి గరిష్టం నుంచి ఒక దశలో 2,133 పాయింట్లు పడిపోయింది. ఇక నిఫ్టీ 13,777-13,131 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. అంటే 650 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. యూరోపియన్ దేశాలన్నీ బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేసుకోవడం, బ్రిటన్లో అత్యంత కఠినమైన లాక్డౌన్ కు తెరతీయడం వంటి అంశాలు తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు దారిచూపాయి. దీంతో దేశీయంగా ఇన్వెస్టర్లు ఉన్నట్టుండి అన్ని రంగాలలోనూ అమ్మకాలకు క్యూకట్టారు. ఫలితంగా ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 7-2 శాతం మధ్య నష్టపోయాయి. బీఎస్ఈలోనూ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 4.5 శాతం స్థాయిలో పతనమయ్యాయి.