స్పైస్ జెట్ ..999 రూపాయలకే విమాన టిక్కెట్లు
కరోనా సమయంలో ఎయిర్ లైన్స్ భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. ఇప్పుడిప్పుడే దేశంలో కేసులు తగ్గి పరిస్థితిలో కాస్త మార్పు వస్తోంది. అయితే మళ్ళీ డెల్టా ప్లస్ వేరియంట్ ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పాటు సహజంగానే ఈ సీజన్ లో విమాన ప్రయాణికులు చాలా తక్కువగా ఉంటారు. మరో వైపు కరోనా భయం. అందుకే దేశంలోని ప్రముఖ చౌకధరల ఎయిర్ లైన్స్స్పైస్ జెట్ సీట్లను భర్తీ చేసుకునేందుకు కొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది. మెగా మాన్ సూన్ సేల్ పేరుతో దేశీయ విమాన టిక్కెట్లను 999 రూపాయలకే విక్రయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్స్ జూన్ 25 నుంచి 30 వరకూ కొనసాగనున్నాయి.
ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు 2021ఆగస్టు నుంచి 2022 మార్చి31లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. 149 రూపాయల అదనంగా చెల్లించటం ద్వారా నచ్చిన సీట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. స్పైస్ జెట్ వెబ్ సైట్ తోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి పలు ఇతర ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఢిల్లీతోపాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ ల్లో ఎలాంటి క్వారంటైన్ తోపాటు ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ లు కూడా అవసరంలేదని స్పైస్ జెట్ వెల్లడించింది.