Telugu Gateway
Top Stories

వాట్సప్ కు పోటీగా దూసుకొస్తున్న 'సిగ్నల్ యాప్'

వాట్సప్ కు పోటీగా దూసుకొస్తున్న సిగ్నల్ యాప్
X

వాట్సప్ తో పోలిస్తే సిగ్నల్ యాప్ యూజర్ నుంచి ఎలాంటి వివరాలు సేకరించదు. ఒక్క ఫోన్ నెంబర్ తప్ప. ఇప్పుడు వాట్సప్ తెచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్లు ఒకింత ఆందోళన చెందుతున్నారు. అందుకే కొంత మంది వాట్సప్ కు గుడ్ బై చెప్పి...సిగ్నల్ యాప్..తోపాటు ఇతర యాప్ లైన టెలిగ్రామ్ వంటి వాటివైపు మళ్ళుతున్నారు. తాజాగా ప్రపంచంలోని నెంబర్ వన్ కుబేరుడు అయిన ఎలన్ మస్క్ కూడా సిగ్నల్ యాప్ కు అనుకూలంగా ట్వీట్ చేయటంతో సిగ్నల్ యూజర్లు గణనీయంగా పెరుగుతున్నారు. వాట్సప్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను అంగీకరించకపోతే వారి మొబైల్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నెల రోజుల తర్వాత ఫిబ్రవరి 8 నుంచి పనిచేయదని సంస్థ పేర్కొంది. ఈ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్‌ సంబంధిత సర్వీసులతో యూజర్‌ డేటా పంచుకోవడమమనేది ముఖ్యమైన అంశం. యూజర్‌ వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకోనుంది.

ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి వాట్సాప్ యూజర్లు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఇతర మెసెంజర్ యాప్ ల వైపు చూస్తున్నారు. ఇవి గోప్యతకు పరంగా కట్టుదిట్టంగా ఉంటాయి. చాలా మంది కొత్త వ్యక్తులు సిగ్నల్ గ్రూప్ లింక్‌ ద్వారా మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరడానికి ప్రయత్నించడంతో సిగ్నల్ యాప్ లో సాంకేతిక లోపం ఏర్పడినట్లు "సిగ్నల్" సంస్థ ట్వీట్ చేసింది. గ్రూప్ లింక్‌ను ఉపయోగించి ఇతర మెసెంజర్ యాప్ ల నుంచి సిగ్నల్ యాప్కి చేరుకోవడానికి ఏ విధంగా చేరుకోవాలో తెలియజేసే గైడ్‌ను కంపెనీ విడుదల చేసింది. అంతే కాదు సమస్యను కూడా వేగంగానే పరిష్కరించింది. మరి సిగ్నల్ యాప్ ఏ మేరకు వాట్సప్ పై ప్రభావం చూపిస్తుందో వేచిచూడాల్సిందే. ఇప్పుడు మార్కెట్లో పరిస్థితి వాట్సప్ వర్సెస్ సిగ్నల్ అన్నట్లుగా మారుతోంది. సమాచార భద్రత విషయంలో సిగ్నల్ కు మంచి పేరుంది. ముఖ్యంగా భద్రతా నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు.

Next Story
Share it