సానియా మీర్జాకు దుబాయ్ గోల్డెన్ వీసా
భారత్ కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పదేళ్ల దుబాయ్ గోల్డెన్ వీసా పొందారు. ఈ వీసా దక్కించుకున్న దేశ సెలబ్రిటీల్లో ఆమె మూడవ వ్యక్తి. ఇప్పటికే బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్, సంజయ్ దత్ లకు దుబాయ్ గోల్డెన్ వీసా ఉంది. దుబాయ్ తన రెండవ ఇళ్లు లాంటిది అని..తాము ఇక్కడ మరింత సమయం గడిపేందుకు చూస్తున్నామని సానియా వ్యాఖ్యానించింది. దుబాయ్ తనకూ, తన కుటుంబానికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అంటూ ఈ వీసా మంజూరుపై సానియా సంతోషం వ్యక్తం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన గోల్డెన్ వీసా పొందిన వారిలో క్రిస్టినో రొనాల్డో, పాల్ పొగ్బా, నొవక్ జకొవిక్ ఉన్నారు.
పాకి్స్తాన్ కు చెందిన ప్రముఖ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను సానియా 2010లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. షోయబ్, సానియాలు దుబాయ్ లో తమ అకాడమీ ద్వారా క్రికెట్, టెన్నిస్ కొచింగ్ ఇచ్చే పనుల్లో ఉన్నారని సమాచారం. గోల్డెన్ వీసా రావటంతో సానియా మీర్జా, సోయబ్ మాలిక్ లు పదేళ్ల పాటు అక్కడ నివాసం ఉండే వెసులుబాటు లభించనుంది. జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్న ఒలింపిక్స్ లో సానియా పాల్గొంటున్నారు. గోల్లెడ్ వీసా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. విదేశీయులు ఎవరైనా అక్కడ దీర్ఘకాల నివాసం ఏర్పాటు చేసుకోవటంతోపాటు అక్కడ వంద శాతం యాజమాన్య హక్కులతో వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుంది.