రిలయన్స్ చేతికి టి మొబైల్ నెదర్లాండ్స్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో భారీ డీల్ కు రెడీ అవుతోంది. గత కొంత కాలంగా ఈ సంస్థ వివిధ రంగాలకు చెందిన కంపెనీలను కొనుగోళ్లు చేస్తోంది. తాజాగా నెదర్లాండ్స్ కు చెందిన టి మొబైల్ లో మెజారిటీ వాటా కొనుగోలు చేసే పనిలో ఉంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయని..దీనికి సంబంధించి 5.7 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు లైవ్ మింట్ కథనం ప్రచురించింది. టి మొబైల్ నెదర్లాండ్స్ లో అతి పెద్ద టెలికం ఆపరేటర్. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే భారత్ లో జియోతో సంచలనాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా పలు దేశాల్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత మూడు నెలలుగా ఈ డీల్ కు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని పేర్కొన్నారు.
రిలయన్స్ జియో వ్యవహరాలను చూస్తున్న ఆకాష్ అంబానీనే ఈ డీల్ వ్యవహరాలు కూడా చూసుకంటున్నారు. ఆయిల్, రిఫైనరీ విభాగాల నుంచి ఇతర రంగాలపై రిలయన్స్ ఫోకస్ పెడుతోంది. టి మొబైల్ నెదర్లాండ్స్ కు 57 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. రిటైల్ రంగంతో పాటు డిజిటల్ సర్వీసెస్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేసిన రిలయన్స్ ఈ దిశగా భారీ అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. జియో ఫ్లాట్ ఫామ్స్ లో 33.52 శాతం వాటాలను రిలయన్స్ కొద్ది కాలం క్రితం 1.52 లక్షల కోట్ల రూపాయలకు గూగుల్, ఫేస్ బుక్, ఇంటెల్, క్వాల్ కామ్ తోపాటు పలు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్వీటీ ఫండ్స్ కు విక్రయించిన విషయం తెలిసిందే.