వడ్డీ రేట్లలో మార్పుల్లేవ్

దేశంలో మరోసారి కరోనా విజృంభణ సాగుతున్న దశలో రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఆర్ బీఐ) ఆచితూచి అడుగులు వేసింది. బుధవారం నాడు నిర్వహించిన పరపతి సమీక్షలో వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగనున్నాయి. ఈ విషయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. రేట్లను యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.
రెండో దశలో కరోనా వైరస్ కేసులు పెరగడం, తాజా ఆంక్షలునేపథ్యంలో కీలక రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని శక్తి కాంత్దాస్ వివరించారు. వృద్ధికి తోడ్పడటానికి , ద్రవ్యోల్బణ టార్గెట్ను సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కోవిడ్ మహమ్మారి ఆర్థికవృద్ధి, రికవరీపై అనిశ్చితిని సృష్టించిందని గవర్నర్ చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా, సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగానూ అంచనా వేసినట్లు తెలిపారు.