'ఖతార్ ఎయిర్ వేస్' కు ఎయిర్ లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
దోహ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రముఖ ఎయిర్ లైన్స్ 'ఖతార్ ఎయిర్ వేస్' 2021 సంవత్సరానికి గాను ఎయిర్ లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును దక్కించుకుంది. ఎయిర్ లైన్ రేటింగ్స్ నుంచి తమకు ఈ గుర్తింపు దక్కినట్లు ఖతార్ ఎయిర్ వేస్ వెల్లడించింది.ఇన్నోవేషన్, నెట్ వర్క్, సేఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తమకు ఈ అవార్డు ఇచ్చినట్లు సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. అయితే తాము దీన్ని అవార్డుగా కాకుండా..మరింత బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొంది. ఎకానమీ సేవలతోపాటు అత్యంత ఖరీదైన సేవల విషయంలో ఖతార్ ఎయిర్ వేస్ కు ప్రత్యేకత ఉంది.
ఈ ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా 130 ప్రాంతాలకు సేవలు అందిస్తోంది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం పలు దేశాల మధ్య రాకపోకలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కరోనా కష్టకాలంలో అత్యంత సేఫ్టీ ప్రమాణాలప్రకారం ప్రయాణికులకు సేవలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 1997లో ఎయిర్ లైన్స్ ప్రారంభించినప్పటి నుంచి ఖతార్ ఎయిర్ వేస్ ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది.