డబ్బులు ముద్రించండి..పేదలకు పంచండి
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు, కొటక్ మహీంద్రా సీఈవో ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాకపోతే ..ఇంకెప్పుడుఅంటూ ఆయన ప్రశ్నించారు. డబ్బులు ముద్రించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఆర్ బిఐలు తమ బ్యాలెన్స్ షీట్ పెంచుకోవాలని సూచించారు.. కరోనా సంక్షోభ సమయంలో ఆర్ధిక వ్యవస్థను ఆదుకునేందుకు ఇదొక్కటే మార్గం అని సూచించారు. జీడీపీలో ఒక శాతం మొత్తాన్ని పేదలకు బదిలీ అయ్యేలా చూడాలన్నారు. పేదలకు ఏదో ఒకటి చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
ప్రభుత్వం పేదలకు నగదు బదిలీ చేసే అంశాన్ని పరిశీలించాలని ఉదయ్ కొటక్ ఎన్ డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఇదే కింది స్థాయి నుంచి డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకులు మరికొంత కాలం ఇబ్బందులను భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది ఆర్ధిక వ్యవస్థపై కూడా ప్రభావం ఛూపుతుందని తెలిపారు. ఆర్ బిఐ మారటోరియం, ఒక సారి పునర్ వ్యవస్థీకరణ వంటి వెసులుబాట్లను బ్యాంకులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.