ఇంధన ధరలపై కేంద్రం షాకింగ్ క్లారిటీ!

అమెరికా, ఇరాన్ లు శాంతి ఒప్పందం పై సంతకాలు కూడా చేశాయి. యుద్ధం పూర్తిగా ఆగింది.అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర రోజూ తగ్గుతూనే ఉంది. మరి పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గేదెప్పుడు?. సోషల్ మీడియా లో ఇదే అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కొంత మంది కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శలు కూడా చేస్తున్నారు. శాంతి ఒప్పందం ఖరారు అయినట్లు ఎప్పుడైతే ఇరాన్ కూడా ద్రువీకరించిందో అప్పటి నుంచే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభం అయ్యాయి. బుధవారంతో పోలిస్తే గురువారం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర రెండు శాతం పైగా తగ్గి..75 .22 డాలర్లకు చేరింది. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక వైపు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఇంతగా తగ్గుతుంటే పెంచిన ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనే చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఈ విషయంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు తగ్గినా కూడా దేశంలో వెంటనే రేట్లు తగ్గించలేము అని స్పష్టం చేసింది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు చేసిన యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంతో కేంద్రంలోని మోడీ సర్కారు గత రెండు నెలల కాలం లో దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు ఏడున్నర రూపాయల మేర పెంచాయి. హార్ముజ్ జలసంధి నుంచి ఇప్పుడు చమురు రవాణాకు మార్గం సుగమం అయినా కూడా అక్కడ నౌకల రద్దీ చాలా ఎక్కువగా ఉంది అని...తగ్గిన చమురు ధరలతో కూడిన ఇంధనం దేశంలోకి రావటానికి చాలా సమయం పడుతుంది అని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి వెల్లడించారు.



