ఆగని పేటీఎం షేర్ల పతనం
దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ఇష్యూ ద్వారా సంచలనం రేపిన పేటీఎం మదుపర్లకు చుక్కలు చూపిస్తోంది. లిస్టింగ్ దగ్గర నుంచి మధ్యలో ఏదో ఒక రోజు తప్ప ఈ షేర్లు పతనం బాటలోనే కొనసాగుతున్నాయి. లిస్ట్అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ షేర్లు ఆఫర్ దరను అధిగమించలేదు. లిస్టింగ్ లోనే ఇన్వెస్టర్లకు చుక్కలు చూపించింది. పేటీఎం ఆఫర్ ధర 2150 రూపాయలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ధర ఎప్పటికి వస్తుందో అన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో నెలకొంది. మరో విశేషం ఏమిటంటే బుధవారం నాడు స్టాక్ మార్కెట్ ఏకంగా వెయ్యి పాయింట్లకుపైనే లాభపడినా కూడా ఈ షేరు నష్టాల బాటలోనే కొనసాగింది.
బుధవారం నాడు పేటీఎం షేరు 22.80 రూపాయల నష్టంతో 1553.80 రూపాయల వద్ద ముగిసింది. మధ్యలో ఓ సారి 1609.00 రూపాయలకు చేరినా అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేష న్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి 18 వేల కోట్ల రూపాయలు సమీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికి భారత్ లో ఇదే అతి పెద్ద ఐపీవో కావటం మరో విశేషం. పేటీఎం వ్యాల్యూయేషన్ పై కొంత మంది నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా కొన్ని సంస్థలు పేటీఎం షేర్ల కొనుగోలుకు సిఫా్రసులు చేసినా కూడా మార్కెట్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.