పేటీఎంకు 473 కోట్ల రూపాయల నష్టం
వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2021 సెప్టెంబర్ తో ముగిసిన మూడు నెలల కాలానికి 473 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ నష్టం 437 కోట్ల రూపాయలు మాత్రమే. ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థే వన్ 97 కమ్యూనికేషన్స్. ఐపీవోకు వచ్చిన తర్వాత ఈ సంస్థ తొలిసారి ఫలితాలను శనివారం నాడు ప్రకటించింది. అయితే ఇదే కాలంలో కంపెనీ ఆదాయం మాత్రం 64 శాతం మేర పెరిగి 1090 కోట్ల రూపాయలకు చేరినట్లు వెల్లడించింది. ఇందులో నాన్ యూపీఐ ఆదాయాలు 52 శాతం మేర పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.
కంపెనీ వ్యయాలు 1170 కోట్ల రూపాయల నుంచి 1600 కోట్ల రూపాయలకు పెరిగాయి. పేటీఎం ఇటీవలే ఐపీవోకు వచ్చి 18000 కోట్ల రూపాయలు సమీకరించిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద ఐపీవోగా పేటీఎం నిలిచింది. అయితే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ విషయంలో మదుపర్లకు నిరాశ మిగిల్చింది. లిస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఆఫర్ ధర అయిన 2150 రూపాయలకే ఈ షేరు చేరుకోలేదు. తొలి రోజు ఈ కంపెనీ షేర్లు 27 శాతం మేర నష్టపోయాయి.