పానీపూరి...కరోడ్ పతి
పానీపూరి..చాట్ విక్రయదార్ల ఆస్తులు చూసి ఐటి శాఖకే కళ్ళు తిరిగాయి. ఒక్కరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 256 మంది చాట్ విక్రయదారులు కోటీశ్వరులుగా బయటపడ్డారు. అంతే కాదు వీరు అంతా కలసి ఏకంగా 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేశారు. కానీ వీరెవరూ రూపాయి జీఎస్టీ లేదు..ఐటి గురించి ఆలోచించింది లేదు. అయితే ఐటి, జీఎస్టీ శాఖల విచారణలోనే ఈ సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రతి నగరంలో నగరంలో రోడ్ల పక్కన పానీపూరి బండ్లు సహజం. యువత ఆ బండ్ల దగ్గర పానీపూరి..చాట్ ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా కామన్. అయితే వీరికి ఇంత ఆదాయం ఉంటుందా అన్న సంగతి తెలిసి అధికారులే అవాక్కు అవుతున్నారు. ఇలా చాట్, పానీపూరి, టీ, స్నాక్స్, సమోసాలు అమ్మేవారు మిలియనీర్లుగా మారారని జీఎస్టీ విచారణలో తేలింది. ఇది అంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా?. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకున్న ఈ వ్యవహరం తాజాగా వెలుగులోకి వచ్చింది.
మార్కెట్లలో, రోడ్ల పక్కన చిన్న పానీపూరి..చాట్ లు అమ్మేవారు, పాన్ షాపు, ఇతర వ్యాపారులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించినట్లు తెలిపారు. ఈ వ్యవహరం కాన్పూర్ లో పెద్ద సంచలనంగా మారింది. కొంత మంది పండ్లు అమ్మేవారు కూడా మిలీయనీర్లుగా మారటమే కాదు..సాగుకు అత్యంత అనువైన వందల ఎకరాల సాగు భూములను కొనుగోలు చేశారు. డేటా సాఫ్ట్ వేర్, ఇతర సాంకేతిక టూల్స్ ను ఉయోగించి చేసిన విచారణలో ఈ విషయాలు వెలుగుచూశాయి. వీరు అంతా అక్కలు, చెల్లెళ్లు, మామల పేర్ల మీదట వందల కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేశారు. అయితే ఒకేసారి ఇంత మంది పట్టుబడటం మాత్రం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.