దేశంలో కరోనా కేసులు తగ్గాయ్
దేశంలో కరోనా కేసులు 46,148కి తగ్గాయి. గతంలో ఓ సారి ఏభై వేల దిగువకు వచ్చినట్లే వచ్చి మళ్లీ పెరిగాయి. ఇప్పుడు మరోసారి 46,148గా నమోదు అయ్యాయి. కొత్తగా నమోదు అయిన కేసుల కంటే రికవరి అయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. తాజాగా వచ్చిన కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం దేశంలో 5,72,994 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు దేశంలో 979 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. దేశంలో ఇప్పటివరకూ 32.36 కోట్ల మందికిపైనే వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం జులైలో మరింత ఊపందుకునే అవకాశం ఉంది. దీనికి కారణం ఆయా కంపెనీల నుంచి ఎక్కువ మొత్తం వ్యాక్సిన్లు అందుబాటు లోకి రానుండటమే.
ఇదిలా ఉంటే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా డెల్టా ప్లస్ వేరియంట్ పై మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది దేశంలో మూడవ వేవ్ కు కారణం కావొచ్చనే భయాలు ఉన్నాయి. అయితే ఇది తొందరపాటు అంచనా అవుతుందని కొంత మంది నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్లు తీసుకున్న వారు..తీసుకోని వారూ కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు డెల్టా ప్లస్ పై ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో కొత్తగా లాంబ్డా వేరియంట్ తెరపైకి వచ్చింది. ఇది ఇప్పటికే 29 దేశాల్లో ఉన్నట్లు అంచనా. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావాన్ని మదింపు చేసేందుకు పరిశోధనలు సాగుతున్నాయి.