రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వరసగా రెండవ ఏడాది కూడా వేతనం తీసుకోలేదు. దీంతో ఆయన గత రెండేళ్ల కాలంలో 30 కోట్ల రూపాయల వేతనం వదులుకున్నట్లు అయింది. కరోనా సమయంలో ఆయన తొలుత వేతనం తీసుకోవటం లేదని ప్రకటన చేశారు. రెండవ ఏడాది కూడా అదే ట్రెండ్ ను కొనసాగించారు. వేతనంతోపాటు ఇతర రాయితీల కింద భారీ మొత్తాలను పొందే అవకాశం ఉన్నా ఆయన తన వేతనాన్ని గరిష్టంగా 15 కోట్ల రూపాయలుగా నిర్ధారించుకున్నారు. 2008-09 నుండి 2019-2020 వరకు ఈ 11ఏళ్ల కాలంలో ఏడాదికి జీతం రూ.15కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఎలాంటి పెంపు లేకుండా దీన్ని అలా అమలు చేస్తున్నారు. తాజాగా వెలువడిన వార్షిక నివేదికలో అంబానీ తాజాగా కూడా ఎలాంటి వేతనం తీసుకోలేదనే విషయం బహిర్గతం అయింది. రిలయన్స్ బోర్డులోని ఇతర సభ్యుల వేతనాల్లో మాత్రం పెద్దగా ఎలాంటి మార్పులు లేవు.