థార్ కు పోటీగా మారుతి నుంచి జిమ్నీ
మార్కెట్లో నిలడాలంటే పోటీని తట్టుకోవాల్సిందే. అది ఆటోమోబైల్ పరిశ్రమ అయినా..ఏ రంగం అయినా అంతే. ప్రత్యర్ధులు వేసే ఎత్తులకు ధీటుగా వ్యూహాలను రచించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే మార్కెట్ లీడర్ గా నిలబడగలరు. ఈ సూత్రం కార్పొరేట్ రంగంలో అన్నింటికి వర్తిస్తుంది. ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో అదే నడుస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) తెచ్చిన థార్ వాహనం ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ వాహనాల కోసం నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఈ తరుణంలో థార్ కు పోటీగా దేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతి జిమ్మి పేరుతో కొత్త వాహనాన్ని అందుబాటులోకి తెస్తోంది. సేమ్ టూ సేమ్ థార్ మోడల్ లోనే ఇది రాబోతుంది. మారుతి తీసుకువస్తోన్న ఆఫ్ రోడ్ ఎస్యూవీ కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంది. మారుతి సుజుకీ జిమ్నీకి సంబంధించిన టీజర్ను సోషల్ మీడియా హ్యాండిల్స్లో లాంచ్ చేసింది. అన్ని రకాల భూభాగాల్లో అడ్వెంచరస్ డ్రైవింగ్ అనుభూతిని వాహనదారులకు అందిస్తుందని మారుతి సుజుకీ పేర్కొంది.
మహీంద్రా థార్కు పోటీగా ప్రముఖ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఆఫ్ రోడ్స్ ఎస్యూవీ కార్లపై ఫోకస్ పెట్టాయి. భారత మార్కెట్లలోకి థార్కు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ గుర్ఖా పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మహీంద్రా థార్కు పోటీగా మారుతి సుజుకి భారత మార్కెట్లలోకి 'జిమ్నీ' పేరుతో ఆఫ్ రోడ్ ఎస్యూవీను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మహీంద్రా థార్కు తీసిపోకుండా అదే స్టైల్తో జిమ్నీ రానుంది. మారుతి సుజుకీ జిమ్నీ ఎస్యూవీ 3 డోర్ వెర్షన్తో రానుంది. ఈ కారును హర్యానాలోని మానేసర్లో ప్లాంట్లో తయారుచేశారు. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు కూడా ఎగుమతి కానుంది. భారతీయుల కోసం ప్రత్యేకంగా 5 డోర్ వెర్షన్తో రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది.