Telugu Gateway
Top Stories

ఆధార్ తో ఓట‌ర్ గుర్తింపు కార్డు అనుసంధానం

ఆధార్ తో ఓట‌ర్ గుర్తింపు కార్డు అనుసంధానం
X

ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల విష‌యంలో కీల‌క ముందడుగు. బోగ‌స్ ఓట్ల నివార‌ణ‌కు ఓట‌ర్ గుర్తింపు కార్డ్ తో ఆధార్ ను అనుసంధానం చేయ‌నున్నారు. ఎన్నిక‌ల సంఘం చేసిన ఈ సూచ‌న‌కు కేంద్ర మంత్రివ‌ర్గం బుధ‌వారం నాడు ఆమోదముద్ర వేసింది. అయితే ఇది ఓట‌ర్ల అభిమతం మేర‌కే చేస్తారు త‌ప్ప‌..త‌ప్ప‌నిస‌రికాదు అని స్ప‌ష్టం చేశారు. ఇది ఒక్క‌టే ఇందులో ప్ర‌తికూల అంశంగా ఉంది. భోగ‌స్ ఓట్ల నివార‌ణ‌కు ఓట‌ర్ కార్డు, ఆధార్ అనుసంధానం చేయాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉంది. ఈ దిశ‌గా కేంద్రం ఓ అడుగు అయితే ముందుకేసింది. తాజాగా నాలుగు ఎన్నికల సంస్కరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఇందుకు సంబంధించిన బిల్లులు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.పాన్-ఆధార్ లింక్ చేసినట్లే, ఓటర్ ఐడి లేదా ఎలక్టోరల్ కార్డ్‌తో ఆధార్ కార్డ్ లింక్‌ను అనుమతిస్తారు. అయితే ఇది స్వచ్ఛంద ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి, 18 సంవత్సరాలు నిండిన వయోజనులు నాలుగు వేర్వేరు కటాఫ్ తేదీలతో సంవత్సరానికి నాలుగు సార్లు ఓటును నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉండేది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సర్వీసు ఓటర్లుగా భర్త పనిచేసే ప్రాంతంలో జీవిత భాగస్వాములు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అయితే ఇకమీదట మహిళా ప్రభుత్వ ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా భార్య పనిచేసే ప్రాంతంలో సర్వీసు ఓటరుగా నమోదు చేసుకోవడానికి వీలు కల్పించారు. ఎన్నికల నిర్వహణ కోసం ఏ ప్రదేశాన్ని అయినా స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని అధికారాలను కూడా ఎన్నికల కమిషన్‌కి ఇచ్చింది. ఎన్నికల సమయంలో పాఠశాలలు, ఇతర ముఖ్యమైన సంస్థలను స్వాధీనం చేసుకోవడంపై ఇదివరకు కొన్ని అభ్యంతరాలు ఉండేవి. వీటన్నిటిని ఆమోదిస్తూ బుధవారం కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక ఎన్నికల సంస్కరణల బిల్లులను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

Next Story
Share it