అధికారికంగా వెల్లడి

జపాన్ కు చెందిన సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్ఎంబిసి) యెస్ బ్యాంకు లో 20 శాతం వాటా కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు యెస్ బ్యాంకు లో ఎస్ఎంబిసి అతి పెద్ద వాటాదారుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వాటా మరింత పెరిగే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితమే ఎస్ బ్యాంకు లో యెస్ ఎంబిసి లో 50 శాతం పైగా వాటా కొనుగోలుకు డీల్ కుదిరింది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంలోనే యెస్ బ్యాంకు డీల్ పూర్తి కావాల్సి ఉన్నా...రకరకాల కారణాలతో అది వాయిదా పడింది.
ఎస్ఎంబిసి ఇప్పుడు ఎస్ బిఐ నుంచి 13 .19 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇతర బ్యాంకు లు అయిన యాక్సిస్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఐడీఎఫ్ సి ఫస్ట్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు ల నుంచి మరో 6 .81 శాతం వాటాను కొనుగోలు చేయనున్నాయి. ఒక్కో యెస్ బ్యాంకు షేర్ ను 21.50 రూపాయల లెక్కన ఎస్ఎం బిసి కొనుగులు చేసింది. ఎస్ బిఐ కి మొత్తం యెస్ బ్యాంకు లో 24 శాతం వాటా ఉండగా ఇప్పుడు 13 .19 శాతం వాటా విక్రయంతో ఇంకా 10 .78 శాతం వాటా ఉంది.
యెస్ బ్యాంకు, సుమిటోమో తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇద్దరు నాన్ ఎగ్జిక్యూటివ్, ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ను నియమించుకునే వెసులుబాటు ఉంది. తాజాగా యెస్ బ్యాంకు, జపాన్ బ్యాంకు ల మధ్య కుదిరిన డీల్ కు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా తో పాటు కాంపిటీషన్ కమిషన్ అఫ్ ఇండియా అనుమతులు రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ డీల్ కు సంబంధించి ముందస్తు కసరత్తు చాలా జరిగినందున ఈ అనుమతుల విషయంలో పెద్దగా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదు అని చెపుతున్నారు. 2020 సంవత్సరంలో ఆర్ బిఐ ఎస్ బ్యాంకు బోర్డు ను సస్పెండ్ చేసిన తర్వాత ఎస్ బిఐ నేతృత్వంలోని బ్యాంకు ల కన్సార్టియం ఎస్ బ్యాంకు ను సంక్షోభం నుంచి కాపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకు లు అన్ని తమ వాటాలను లాభాలకు అమ్ముకుని సేఫ్ గా బయటకు వచ్చాయి.
మరో వైపు ఎస్ బ్యాంకు నిలబడినట్లు కూడా అయింది. ఈ డెవలప్ మెంట్ నేపథ్యంలో శుక్రవారం నాడు యెస్ బ్యాంకు షేర్లు ఏకంగా పది శాతం మేర లాభపడి 20 రూపాయల వద్ద ముగిశాయి. ఇప్పటి వరకు ఈ బ్యాంకు లో అతి పెద్ద వాటాదారుగా ఉన్నా ఎస్ బిఐ షేర్లు కూడా పదకొండు రూపాయల లాభంతో 779 రూపాయల వద్ద ముగిశాయి. జపాన్ కు చెందిన ప్రముఖ సంస్థ చేతికి యెస్ బ్యాంకు వెళుతుండటంతో రాబోయే రోజుల్లో బ్యాంకు పని తీరు మరింత మెరుగుపడి ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి.