విదేశీ ఆటగాళ్లు వెనక్కి!

ప్రచారమే నిజం అయింది. ఇండియా-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 లో మిగిలిన మ్యాచ్ లు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గురువారం రాత్రి కూడా సడన్ గా ధర్మశాలలో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్-పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బీసిసిఐ ఐపీఎల్ మ్యాచ్ లను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. నిరవధికంగా వాయిదా వేస్తున్నామని చెప్పడంతో ఇక ఈ సీజన్ ముగిసినట్లే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
షెడ్యూల్ ప్రకారం అయితే మే 25 న కోల్ కతా లో ఫైనల్ ఐపీఎల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. పాయింట్ల పరంగా చూసుకుంటే ఇప్పుడు జాబితాలో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై లు టాప్ నాలుగు స్థానాల్లో ఉన్నాయి. విదేశీ ఆటగాళ్లను వాళ్ళ వాళ్ళ దేశాలకు సురక్షితంగా పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసిసిఐ ప్రకటించటంతో ఈ సారికి ఇక ఐపీఎల్ కథ ముగిసినట్లే అని భావిస్తున్నారు. అయితే తొలిసారి ఆర్ సిబి జట్టు మంచి ఫార్మ్ లోకి వచ్చి ఈ సారి కప్పు కొట్టేస్తుంది అని ఫ్యాన్స్ అంతా భావిస్తున్న సమయంలో వాళ్లకు ఇది ఊహించని పరిణామమే. ఒక వేళ తిరిగి మ్యాచ్ లు నిర్వహించే వాతావరణం ఉంటే కేంద్రం తో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
వారమే వాయిదా
ఇదిలా ఉంటే తొలుత ఐపీఎల్ నిరవధిక వాయిదా అని వార్తలు వచ్చాయి. తర్వాత మాత్రం ఒక వారం వాయిదా అని అధికారికంగా ప్రకటించారు. ఆటగాళ్ల భధ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం అని బిసిసిఐ ప్రకటించింది. ఒక వైపు దేశం యుద్ధం చేస్తుంటే మరో వైపు క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించటం సరికాదు అనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అనేక ఫ్రాంచైజ్ లు కూడా ఆటగాళ్ల భధ్రత విషయంలో ఆందోనళన వ్యక్తం చేశాయి అని...ప్రసారకర్తలు, స్పాన్సరర్లు, అభిమానుల అభిప్రాయాలు కూడా తీసుకుని వాయిదా వేసినట్లు తెలిపారు. దేశ భధ్రత దళాలపై తమకు పూర్తి విశ్వాసం ఉంది అని..వారి సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు ఐపీఎల్ పాలకమండలి ఒక ప్రకటనలో పేర్కొంది.