Telugu Gateway
Top Stories

సముద్రంలో కూలిన ఇండోనేషియా విమానం

సముద్రంలో  కూలిన ఇండోనేషియా విమానం
X

విషాదం. ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ బోయింగ్‌-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. జావా సముద్రంలో ఈ విమానం పడిపోయినట్లు గుర్తించారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా విమాన శకలాలు కనపించడంతో విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ప్రయాణిస్తున్న ప్యాసింజర్ జెట్ ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తో సంబంధాలు కోల్పోయాయని అధికారులు తెలిపారు.

రాడార్ డేటాబాక్స్ ప్రకారం మధ్యాహ్నం 1.56 గంటలకు జకార్తా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాలు కోల్పోయిందని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదితా ఇరావతి తెలిపారు. ఈ ఘటనపై నేషనల్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టిందన్నారు. మరోవైపు జకార్తా సమీపంలోని తంగేరాంగ్‌లోని సూకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ బోయింగ్ విమానం 27 సంవత్సరాల నాటిది అనే వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it